Sunday 5 July 2015

శీల సంపద

ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్ళి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు."నాయనా! నీకుమాత్రం తక్కువ ఐశ్వర్యమా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవై సకల సంపదలూ పొందు" అంటూ ధృతరాష్ట్రుడు కొడిక్కి ఓ ఇతిహాసం చెప్పాడు.
"ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పరిపాలన చేయగల సమర్ధుడు. ఇంద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ముల్లోకాలనూ ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్ళీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు.
బృహస్పతి భార్గవుణ్ణి అడగమన్నాడు.
ఇంద్రుడు వెళ్ళి భార్గవుణ్ణి ఆశ్రయించాడు.
'అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకొని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో' అని సలహా ఇచ్చాడు భార్గవుడు.
"ఇంద్రుడు విప్రుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు.
'నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?' అని అడిగాడు.
'అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుంది ' అన్నాడు శచీపతి వినయంగా.
'ఏముంది! నేనెప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్యా, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరన్నా ఏదైనా అడిగితే లేదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం వున్నది. కనుక ఇంత మహోన్నత పదవి లభించింది నాకు' అన్నాడు ప్రహ్లాదుడు.
'అయ్యా! నిజంగా నువ్వు మహాత్ముడవు. దానశీలివి. నాయందు దయదలచి నీ శీలం నాకివ్వు' అని ఇంద్రుడు దీనంగా యాచించాడు.
'అయ్యో పాపం! ఎంత దీనంగా అర్థిస్తున్నాడు' అనుకుని 'సరే' అన్నాడు ప్రహ్లాదుడు.
ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు.
ఆ తరువాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహా తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు.
'నువ్వెవరు?' ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.
'నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా! అతని దగ్గరకు వెళ్ళిపోతున్నాను' అని వెనుదిరగకుండా వెళ్ళిపోయాడా దివ్యరూపుడు. ఆ వెనుకే ఒక్కొక్క వెలుగూ ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లిగా బయటకు జారుకుంది.
"నువ్వెవరు మహానుభావా?"
'నేను సత్యాన్ని. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. నేను వేడుతున్నాను'
'నువ్వెవరు?'
'నేను ఋజువర్తనను. సత్యాన్ని ఆశ్రయించి బతుకుతాను. పోతున్నాను'.
'మహాశయా! నువ్వెవరు?'
'నేను బలాన్ని. సత్ప్రవర్తనకు తోడుగా ఉంటాను. శలవు.'
ప్రహ్లాదుడి విషాదానికి అవధులు లేవు.
అతను విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతియైన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది.
'అమ్మా! నువ్వెవరు?'
'నేను లక్ష్మిని. బలం ఎక్కడుంటే అక్కడ వుంటాను. వేడుతున్నాను.'
'అయ్యో తల్లీ! నువ్వూ నన్ను విడిచిపోతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్ళూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?' అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు.
'అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటి మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను వుంటాం. కనుకనే అన్నిటికి 'శీలం' మూలమని చెప్తారు. నువ్వు అది పోగొట్టుకున్నావు. కనుక ఇంక నీ దగ్గర వుండటం అసంభవం' అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి.
"కనుక - దుర్యోధనా! శీలవంతుడవై వర్థిల్లు నాయనా" అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.
సకల జీవుల పట్ల దయతో వుండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు ఓపినంతవరకూ మేలు చేయడం, ఎదుటివాడు తప్పుచేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం, అందరూ మెచ్చుకునేటట్టు మంచిగా ప్రవర్తించడం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు.

No comments:

Post a Comment