Monday 6 July 2015

శ్రీ మహాలసా దేవస్థానం

సురాసురులు సాగర మథనం గావించినపుడు ముందు హాలాహలం ఉద్భవించగా దేవతలందరూ శంకరుని వేడుకొనగా అమ్మవారి అనుజ్ఞనొంది సాంబశివుడు ఆ గరళమును మ్రింగి తన కంఠమునందు ఇమిడ్చి నీలకంఠుడు అయ్యాడు. అమృతం ఆవిర్భవించగా విష్ణుమూర్తి రాక్షసులను మోసగింప ‘మోహినీ’ రూపమునొంది దేవతలకు అమృతమును ఇచ్చి అసురులకు జలము మాత్రము నిచ్చి యున్నాడు.
ఆ మోహినీ అవతారమును ‘మహాలసా’ అమ్మ వారుగానూ ‘మహాలసా నారాయణి’ గాను గోవా, మహారాష్ట్ర, కన్నడ రాష్ట్రాల వారు కొలుస్తారు. క్షత్రియులు, కొన్ని వర్గాల బ్రాహ్మణులు ‘కులదేవి’గా కొలుస్తారు.
గోవా ‘సష్ఠి’నందు ‘క్రైస్తవ మతము నాచరింపుమని ఉధృత పరిస్థితి నెలకొన్న సమయమున అక్కడ ప్రతిష్ఠించబడి యున్న మహాలసా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం కాకుండా తరలించి పోండా తాలూకా ‘మర్డోల్’నందు పునః ప్రతిష్ఠింప జేసి దేవాలయం నిర్మించడమైనది.
దేవాలయ ఆవరణయందు ‘సంతేరి అమ్మ వారు’ లక్ష్మీనారాయణ వారికి ఉప ఆలయాలు కలవు. ఒక పెద్ద ఇత్తడి గంట, ఇత్తడి దీప స్తంభం ఇచ్చట ప్రసిద్ధం. అమ్మవారి అలంకరణ చాలా శోభాయమానంగా ఉంటుంది. నారాయణుడు గాన యజ్ఞోపవీతం ధరించి ఉంటుంది.
మధ్యాహ్నం, సాయంకాల హారతి కార్యక్రమానంతరం ఇచట గల భోజనశాలయందు భక్తులకు భోజన ప్రసాద వినియోగం కలదు.
ఆదివారం నాడు అమ్మవారికి ‘పల్లకి సేవ’ నిర్వహిస్తారు. భక్తులు పాటలు పాడుతూ భజనలు చేస్తూ పల్లకి సేవలో పాల్గొంటారు.
మాఘమాసమునందు శరన్నవరాత్రులు అమోఘంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

No comments:

Post a Comment