Sunday 5 July 2015

ద్వాదశాదిత్యులు - వృద్ధాదిత్యుడు

పూర్వకాలమందు కాశీపురమున హరీతముని నామముతో నొక వృద్ధ బ్రాహ్మణుడుండెను. ఇతడు సూర్యభగవానుని భక్తుడు. సూర్యుని నిత్యము ఆరాధించుచూ, పూజించుటయే ఇతని జీవనము. ఇతనికొకసారి తాను యువకునిగా మారవలెనను కోరిక కలిగెను. ఈ కోరికతో విశాలక్షీ దేవి మందిరమునకు దక్షిణభాగములో శుభలక్షణములు గల సూర్యదేవుని మూర్తిని నిర్మించుకొని శ్రద్ధాభక్తులతో ఆరాధించుచుండెను.
ప్రసన్నుడైన భాస్కరుడు ప్రత్యక్షమై హారీతమునితో ’మునీ! నీ తపమునకు నేను సంతసించితిని. నీకిష్టమగు వరమును కోరుకొను”మనెను.
ముని “భగవాన్! మీరు నాపై ప్రసన్నులైన నాకు పునః యౌవనమును ప్రసాదించుడు. దానితో నేను ఉత్తమమైన తపస్సు చేయుదును. ఎందులకనగా తపస్సే శ్రేష్ఠమైన ధనము, ధర్మము, కామము మరియు మోక్షము. జితేంద్రియులైన పురుషులు తపస్సు చేయుటకొరకే చిరాయువును కోరెదరు. మోక్షము కొరకే ఉత్తమ జ్ఞానమును కోరెదరు. అందుచేత శ్రేష్ఠమైన తపోసిద్ధికి నేను మిమ్ములను పునః యౌవనమును ప్రసాదించవలసినదిగా యాచించుచుంటిని’ అని ప్రార్థించెను. సూర్యభగవానుడు ’ఏమమస్తు” అనుచు వృద్ధ హరీతముని వృద్ధాప్యమును తొలగించి పుణ్యసాధనకై పునఃయౌవనమును ప్రసాదించెను.
పునఃయౌవనమును పొందిన ముని ఎన్నోదినములు కఠోరమైన తపస్సు చేసెను. తపో తేజస్సునకు వీని రోమములు ప్రజ్వలితమగుచు చివరకు సూర్యభగవానుని దివ్యలోకమునకు వెళ్ళి అక్షయ సుఖములు పొందెను.
వృద్ధునిచే పూజింపబడిన కారణమున కాశీయందు సూర్యుడు వృద్ధాదిత్య నామముతో ప్రసిద్ధిగాంచెను.
హారీతమునిచే స్థాపింపబడిన వృద్ధాదిత్యుని ఉపాసించిన ఎంతోమంది సిద్ధిని పొందిరి.వీనిని ఆరాధించిన వారికి ముసలితనము, దుర్గతి రోగములు నశించును.
వృద్ధాదిత్యం సమారాధ్య వారాణస్యాం ధరోర్భవ!
జరాదుర్గతి రోగఘ్నం బహవః సిద్ధి మాగతాః!!
కాశీయందు ఆదివారమునాడు వృద్ధాదిత్యునకు నమస్కారము చేయువారికి మనోవాంఛిత సిద్ధులు ప్రాప్తించును. వారికెన్నడూ దుర్గతి గలుగదు. కాశీయందు విశాలాక్షి మందిరమునకు దక్షిణమున వృద్ధాదిత్యుడుండెను. వర్తమాన కాలమున మీరా ఘాట్ చెంత హనుమానుని మందిర సమీపమున ఈ మూర్తియుండెను. వీనిని ఉపాసించిన దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, మిత్రులు వివిధ రకములుగ ఉన్నతి స్వర్గము మొదలగునవన్నియు ప్రాప్తించును.

No comments:

Post a Comment