Saturday 4 July 2015

భగవద్గీత తృతీయాధ్యాయ ఫలంతో మనుషులు పాప రహితులు అవడమే కాదు, ప్రేతత్వ విముక్తి కూడా లభిస్తుంది

పూర్వం జనస్థానమనే పట్టణంలో జడుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు బ్రాహ్మణుడైనప్పటికీ సదాచారాన్ని వదలి విషయలోలుడై, ధనాశతో వ్యాపారిగా మారాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళి, వ్యాపారం చేసి తిరిగివస్తూ మార్గమధ్యంలో ఒక వృక్షం క్రింద విశ్రమించాడు. ఇంతలో కొందరు చోరులు అతణ్ణి చంపి, ధనమంతా దోచుకున్నారు. అతడు మరణించిన సంగతి కూడా ఎవరికీ తెలియలేదు. అతడు ఉత్తర క్రియలకు కూడా నోచుకోలేదు. పాపాత్ముడు కావడం వల్ల అతడు పిశాచ రూపంలో ఆ వృక్షాన్నే ఆశ్రయించుకొని ఉండిపోయాడు.
ధర్మాత్ముడైన అతని కుమారుడికి తండ్రికి పట్టిన గతి కొంతకాలానికి తెలిసింది. దాంతో, ఉత్తర క్రియలు చేయడానికి కాశీనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తండ్రిని చంపిన వృక్షం క్రింద కూర్చొని, భగవద్గీత మూడో అధ్యాయాన్ని పఠించడం మొదలుపెట్టాడు.
"తత్రాధ్యాయం స గీతాయ స్తృతీయం సంజజాపః" అని మూడో అధ్యాయాన్ని అతను ముగించిన వెంటనే అతని తండ్రి ప్రేత రూపాన్ని విడిచి దివ్యవిమానారూఢుడై కనిపించాడు.
అప్పుడు పుత్రుడు, "తండ్రీ! నీకు ప్రేతరూపం పోయి ఇలాంటి దివ్యరూపం లభించడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు తండ్రి, కుమారుడితో, "నాయనా! నువ్వు పఠించిన భగవద్గీత మూడో అధ్యాయాన్ని ఈ వృక్షంమీద నుండి విన్నాను. అందువల్లే నాకు ఈ దివ్యస్థితి లభించింది. నాయనా! ఇక నువ్వు కాశీకి పోవాల్సిన పనిేదు. ఇంటికి తిరిగివెళ్ళి, ఇదే ధ్యాసతో భగవద్గీత తృతీయ అధ్యాయ పారాయణ చెయ్యి. తద్వారా లభించిన పుణ్యాన్ని మన వంశజులందరికీ ధారపోసి, అందరినీ నరకంనుండి ఉద్ధరించు" అని పలికాడు.
తండ్రి ఆదేశానుసారం కుమారుడు ఆ విధంగా చేయడంవల్ల విష్ణుభగవానుడు ప్రసన్నుడయ్యాడు. అతని వంశజులంతా దివ్యత్వం పొందారు. కనుక భగవద్గీత తృతీయాధ్యాయ ఫలంతో మనుషులు పాప రహితులు అవడమే కాదు, ప్రేతత్వ విముక్తి కూడా లభిస్తుంది.

No comments:

Post a Comment