Wednesday 17 February 2016

భీష్మ ఏకాదశి


శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పారేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.

గంగా(నది) దేవికి, శంతన మహారాజుకు జన్మించిన అష్టమ సంతానం దేవవ్రతుడు. వసిష్ఠుడి-పరశురాముడు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుని బుద్ధిలో
బృహస్పతితో సముడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి శంతనుడు ఒక రోజు తాను దాశరాజు కుమార్తె అయిన సత్యవతి మీద మనసు పడినట్లు చెప్పాడు.
ఆమెకు కలిగిన సంతానానికి రాజ్యార్హత కల్పిస్తేనే సత్యవతి తనకు సొంతమవుతుందని చెప్పాడు. తండ్రి అంతరంగం అర్థం చేసుకున్న దేవవ్రతుడు- ఆయన కోరిక తీర్చడంకోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ క్షణంనుంచీ అతడి పేరు ‘భీష్ముడు’గా మారింది. కొడుకు త్యాగాన్ని మెచ్చుకున్న తండ్రి అతడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ప్రసాదించాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్ర
వీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలిక అనే ఇద్దరు బాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. సంతానం కలగకుండానే అతడు మరణించాడు. తమ వంశం
నిర్వంశం కాకూడదనే సంకల్పంతో పినతల్లి సత్యవతి, భీష్ముణ్ని పిలిచి, అతడి తమ్ముడి భార్య(అంబిక, అంబాలిక)లను సంతానవతులుగా చేసి వంశాన్ని
నిలబెట్టమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలుతుందనిపించి నిరాకరించాడు భీష్ముడు. అయినప్పటికీ ఆ వంశం
నిలబడటానికి వేదవిదుడైన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులు చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.
కురు పాండవుల మధ్య రాజ్యార్హత విషయంలో శత్రుత్వం ఏర్పడింది. అలా పెరిగిన వైరం కురుక్షేత్ర యుద్ధం వరకు దారి తీసింది. ఎవరికీ ఇష్టం లేకపోయినా
బంధువులు, మిత్రులు, పరివారం అంతా ఇరు వర్గాలుగా విడిపోక తప్పలేదు. భీష్ముడు కౌరవపక్షం వహించాడు. నిష్పక్షపాతంగా, చిత్తశుద్ధితో,
ధర్మబద్ధంగానే యుద్ధం చేశాడు. కాని ఆయన పాండవ పక్షపాతం చూపుతున్నాడని అపనమ్మకం ఏర్పడింది కౌరవులకు. అందుకే సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పుకొమ్మన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోలేదతడు. పాండవసేనలో పరిస్థితి ఇంకోలా ఉంది.
భీష్ముడు కౌరవ పక్షంలో ఉన్నంతసేపూ వారిని జయించడం తమవల్ల కాదనే నిశ్చయానికి వచ్చారు. అందుకే రహస్యంగా కలిసి జయించే మార్గం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తాను కావాలి అనుకుంటున్నవాళ్లు, తనకు కావాలనుకున్నవాళ్లు ఇద్దరూ తనను వద్దనుకుంటున్నారు. కాబట్టి నిష్క్రమించాలని నిశ్చయించుకుని మార్గం
సూచించాడు.
ఆ మేరకు శిఖండిని యుద్ధరంగాన ఆయనకు ఎదురుగా నిలిపారు పాండవులు. యుద్ధభూమిలో శిఖండిని చూస్తూనే అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. అదే
అదనుగా అర్జునుడు వేసిన బాణపు దెబ్బకు కూలిపోయాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడరాదని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేను వాల్చిన అతడికి అది దక్షిణాయణమని గుర్తొచ్చింది. కొద్దిరోజుల్లో ఉత్తరాయణం రాబోతోందని, అప్పుడు తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని అలా తండ్రి ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకుని మరణాన్ని నియంత్రించుకున్నాడు.
ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తన తనుత్యాగానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. మాఘ శుక్ల సప్తమి మొదలుకుని రోజుకొక ప్రాణం చొప్పున విడుస్తూ ఏకాదశి నాటికి విష్ణువులో లీనమైపోయాడని, అందువల్ల ఆ అయిదు రోజులను భీష్మ పంచకం అంటారని మహాభారత కథనం. పై కథనం ఆధారంగా భీష్ముడి నిర్యాణ దినాన్ని భీష్మ ఏకాదశిగా జరుపుతారు.
ధర్మనిరతుడు, కర్మయోగి, ఆదర్శ పురుషుడైనందువల్లే భీష్ముడి నిర్యాణ దినం లోకానికి స్మరణదినమైంది.

మాఘమాసం శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మపంచకం అని అంటారు. ఈ ఐదు రోజులు ప్రాతస్నానమాచరించి స్నానాంగముగా భీష్మాచార్యులకు నీటితో అర్ఘ్యము ఇవ్వవలయును అర్ఘ్యమంత్రము 1 ంభీష్మ: శాంతనవో వీర: సత్యవాదీ జితేంద్రియ: 1 ఆధిరద్భిరవాప్నోతి 
పుత్రపౌత్రోచితాం క్రియాం 1 వైయాఘ్రపదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ1 అపుత్రాయ దదామ్యేతత్ జలం భష్మాయ వర్మిణే 11అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే 1వసూనా మవతారాయ శంతనో రాత్మజాయ చ 11









No comments:

Post a Comment