Monday 8 February 2016

మాఘమాసం



మాఘమాసమున అనగా మకరరాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేర్తాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది.
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ |
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ |
జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ |
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే
మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.
బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలవారూ, అన్ని వర్ణములవారూ, వర్గములవారూ, ప్రాంతాలవారు ఈ మాఘస్నానం చేయవచ్చు.మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసినా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పనె్నండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్నీ, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, గంగాస్నానం సహస్రగుణం, గంగాయమునా సంగమ (త్రివేణి) స్నానం నదీ శత గుణ ఫలాన్నీ ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు.
‘‘దుఃఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ
ప్రాతఃస్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ’’ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి.
రోజూ సమయాభావంవల్ల, అనారోగ్యంవల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.
ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరవాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణ్వార్చన వంటివి విశేష ఫలాన్నిస్తాయి. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. కార్తీకమాసం దీపానికి ప్రధానమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం.
సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంగానీ, బావిగానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో ‘గంగేచ .....జలేస్మిన్ సన్నిధింకురు’’ అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి.
మాఘస్నానానాలన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్తవ్రచనం. ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ వుంది. మాఘపూర్ణిమనాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో, గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. దక్షిణ భారతంలో కృష్ణ, గోదావరి, కావేరి నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానమాచరించు సమయంలో, శివకేశవాది దేవతాస్మరణ, గంగాయమున, సరస్వతి, గోదావరి వంటి పుణ్యనదుల స్మరణ చేయాలి. అదేవిధంగా ఈ మాసంలో దానం, జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది.
పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి. ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.

No comments:

Post a Comment