Monday 15 February 2016

భీష్మాష్టమి


మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు అంటున్నారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
కురువృద్ధుడు మరణించిన తిథి ఈ రోజు . నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది.
అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.
పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.
పూజకు అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనం, లక్షతులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున విష్ణుసహస్రనామస్తోత్రమ్, విష్ణుపురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకములను సన్నిహితులకు తాంబూలముతో ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment