Monday 22 February 2016

యాంటీబయాటిక్స్ ‌తో మానసిక గందరగోళం ...!


బోస్టన్‌: యాంటీబయాటిక్‌ మందుల వాడకం వల్ల మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు ఓ నూతన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం చేసిన పరిశోధకుల బృందంలో హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త షామిక్‌ భట్టాచార్య కూడా ఉన్నారు. యాంటీబయాటిక్స్‌ వాడిన రోగుల్లో మానసిక గందరగోళం(డెలీరియం), లేనివి ఉన్నట్లు కనిపించడం, వినిపించడం, భ్రమలు కలగడం(హాలూసినేషన్స్‌) వంటి లక్షణాలు ఉత్పన్నమైనట్లు భట్టాచార్య తెలిపారు. డెలీరియం వచ్చిన వ్యక్తులు ఇంటికి వెళ్లబోయి ఆస్పత్రికి వెళ్తారని, తీవ్ర గందరగోళంలో ఉంటారని, డెలీరియం రాని రోగితో పోల్చితే ఇది వచ్చిన వారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని భట్టాచార్య చెప్పారు. యాంటీబయాటిక్స్‌ వాడడం వల్ల డెలీరియం వచ్చిన 391 మంది రోగులపై అధ్యయనాలు చేసి.. డెలీరియం తీవ్రతను బట్టి మూడు విభాగాలు చేశామన్నారు. సల్ఫోనమైడ్లు, సిప్రోఫ్లోక్సాసిన్‌, పెనిసిల్లిన్‌, సెఫెపీం, మెట్రోనిడజోల్‌ వంటి 57 యాంటీబయాటిక్‌ మందులు, రోగుల్లో డెలీరియం లక్షణాలను కలిగించినట్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ప్రచురించింది.

No comments:

Post a Comment