Wednesday 27 April 2016

యోగము ప్రాణాయామము


యాజ్ఞవల్క్యుడు, జనకమహారాజా ! నీకిక యోగము గురించి చెప్తాను. సాంఖ్యము కలుగు జ్ఞానము యోగముతో కలిగే బలమూ రెండూ సాటి లేనివి. కొంత మంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు కాని నాను మాత్రం రెండూ ఒకటే అని భావిస్తాను. 'మనోధారణ ప్రాణాయామము అనునవి రెండు ప్రధాన యోగములు. మొదటిది నిర్గుణము రెండవది సగుణము. మనో ధారణ అంటే మనసును ఏకాగ్రతగా ఉంచడం. ప్రాణాయామము అనగా శ్వాసను క్రమపద్ధతిలో వదిలి పీల్చడం. ఇది మానవుడికి అసౌకర్యం కలిగించదు. క్రమపద్ధతిలో ప్రాణాయామం చేస్తూ ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న వాడు యోగసిద్ధి పొందగలడు. ప్రాణాయామం చేసే సాధకుడు నియమ నిష్టలు పాటించాలి. ప్రాణాయామముకు రోజూ కొంత సమయము పాటించాలి. శరీరముకు అసౌకర్యం కలుగని రీతిలో ప్రాణాయామం అభ్యసించాలి. ఇలా ప్రాణాయామం పగలు రాత్రి అభ్యసించాలి. దీని వలన లోపలి వెలుపలి శరీరం శుద్ధి పొందుతుంది. యోగసిద్ధికి ప్రాణాయామము దానివలన కలిగే అంతః బాహ్య శుద్ధి మూలము. ఇది సగుణతంత్రం.
మనోధారణ నిర్గుణతంత్రము. ఇంద్రియములను మనసులో, మనసును అహంకారంలో, అహంకారమును బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం. నిరంతరం ధ్యానంలో నిమగ్నమైన వాడికి ముసలితనము లేదు. యోగికి మలినములు అంటవు, నిరంతర ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు. యోగి గాలిలో పెట్టిన దీపంలా నిశ్చలంగా ఉంటాడు. నిర్మలాకాశంలా ఉంటాడు, అటుపోటులకు చలించని సముద్రంలా ఉంటాడు. అతడి చుట్టూ భయంకర శబ్ధాది మనసుని కలవర పెట్టే విషయములను పట్టించు కొనడు. దీనినే యోగ మార్గం అంటారు. కాని ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి అలసత్వం పనికి రాదు. ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. ఈ యోగికి ఎవరికి అందని మోక్షం లభిస్తుంది.
మరణ సమయంలో ఈ యోగికి పాదముల నుండి ప్రాణములు పోయినట్లైన విష్ణుపదము, పిక్కల నుండి పోయిన వసువులు ఉండే లోకమును, జానువుల(మోకాళ్ళ) నుండి పోయిన సాధ్యులు ఉండే లోకము లభిస్తుంది, విసర్జకావయవము నుండి పోయిన సూర్యలోకము లభిస్తుంది, తొడల నుండి పోయిన ప్రజాపతిలోకము లభిస్తుంది, జననేంద్రియముల నుండి పోతే భూలోకప్రాప్తి లభిస్తుంది, పార్శ్వముల నుండి పోతే మరుత్తుల లోకము ప్రాప్తిస్తుంది, బొడ్డులోనుండి పోతే చంద్రలోకము లభిస్తుంది, చేతుల నుండి పోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, వక్షస్థలం నుండి పోతే కైలాసప్రాప్తి లభిస్తుంది, ముఖములో నుండి పోతే విశ్వదేవతలు ఉండే లోకం లభిస్తుంది. చెవుల నుండి పోతే దిక్పాలకులు ఉండే లోకం లభిస్తుంది. ముక్కుల నుండి పోతే వాయుదేవుడు ఉండే లోకం లభిస్తుంది. కళ్ళ నుండి పోతే అగ్ని దేవుడు ఉండే లోకం లభిస్తుంది. కనుబొమల నుండి పోతే అశ్వినీ దేవతలుండే లోకం ప్రాప్తిస్తుంది. నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం లభిస్తుంది. తలపైభాగం(బ్రహ్మరంధ్రం ) నుండి పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.
మరణసమయం ఆసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీనక్షత్రం కనిపించదు. ముక్కు చెక్కినట్లు కనపడినా, చంద్రుడు మలినంగా కనపడినా అతడి ఆయుస్షు ఒక సంవత్సరమని తెలుసుకోవాలి. ముఖవర్ఛస్సు పెరిగినా తరిగినా, తెలివితేటలు పెరిగినా తరిగినా అతడి ఆయువు ఆరునెలలే అని తెలుసుకోవాలి, పూర్ణచంద్రుడిలో, సూర్యబింబంలో వెలితి కనపడితే అతడి ఆయుర్ధాయం ఏడురోజులే అని తెలుసుకోవాలి. దేవాలయముకు వెళ్ళినప్పుడు దేవుడికి సమర్పించిన పుష్పములు, సుగంధద్రవ్యములు దుర్ఘంధం వెదజల్లితే అతడి ఆయుస్షు ఆరునెలలు మాత్రమే చెవులు ముక్కు వాలిపోయినా దంతములు రంగుమారినా కళ్ళలో కాంతి సన్నగిల్లినా, శరీరం నల్లబడ్డా అతడికి తక్షణమే మృత్యువు అని తెలుసుకోవాలి. మానవుడు అంత్య కాలంలో చేరినప్పుడు ఏ కారణం లేకుండానే కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంటుంది. తలమీద నుండి పొగలు సెగలు వచ్చినా అతడికి చివరి దశ ఆసన్నమైనదని తెలుసుకోవాలి. యోగి అయిన వాడు ఈ సూచనలు గమనించి నిరంతర ధ్యానసమాధిలో ఉండి జీవుడిని ప్రమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి యోగి ప్రాణములు విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందం పొందుతాడు.

No comments:

Post a Comment