Thursday 7 April 2016

నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి ?

నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి ?
.......................................................
గ్రహసంబంధమైన దోషం ఉందనగానే చాలామంది నానాకంగారు పడిపోతారు. అభిషేకాలు ... జపాలు ... దానాలు అంటూ హడావిడి చేసేస్తారు. వాళ్లు అంతగా ఆందోళన చెందడానికి కారణం లేకపోలేదు. గ్రహసంబంధమైన దోషాలు ఆయా జాతకుల జీవితాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేస్తాయని చిన్నప్పటి నుంచి వింటూ వుండటం వలన, మరి కాస్త ఎక్కువగా ఊహించుకుని భయాందోళనలకి గురౌతుంటారు.

అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతోన్న నవగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో వైష్ణవ సంబంధమైన క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. ఇక శివాలయాలకి సంబంధించి కొన్ని చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో నవగ్రహాలు దర్శనమిస్తుంటాయి. కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ వుంటే, మరి కొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ వుంటుంది.

నవగ్రహాలు ఎలా కొలువై వున్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. నవగ్రహాలకు ... శివుడితో గల సంబంధమేమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని వీళ్లు కనబరుస్తుంటారు. ఇందుకు శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే.

అంతే కాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే వుంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే.

No comments:

Post a Comment