Saturday 30 January 2016

నాగా సాధువులు

ఎవరి అపార్థాలతో వారికి పని లేదు..
అలంకారాలు అక్కర లేదు..
జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు.
ఆహార్యం ప్రధానం కాదు..
నగ్నత్వమే వారి వేషం..
ఆహారం ముఖ్యం కాదు..
దొరికిందే తింటే చాలు..
రుచితో పనిలేదు..
శరీరంపై మోహం లేదు..
మృత్యువంటే భయం లేదు..
హిమాలయ సానువుల్లో నివాసం...
పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం..
అడుక్కునే వాళ్లంటూ తిట్టేవాళ్లున్నారు..
అవధూతలని అర్చించేవారూ ఉన్నారు..
ఎవరితోనూ వారికి అవసరం లేదు..
వారు ఎవరికీ అర్థం కారు..
ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు.
ఏమైనా అనుకోండి.. పిచ్చివాళ్లని నిందించుకోండి... వెర్రిబాగుల వాళ్లని వెక్కిరించండి... వంటిమీద నూలుపోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి... శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకొండి.. హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి... వారికి మీ ఊసులు అక్కర లేదు.. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు.. వారికి లోకంతో పని లేదు.. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు.. ఎవరు వారు..? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు?
ఇంటి నుంచి బయటకు కాలు మోపితే, అంతా మనల్నే చూడాలని ఎంత తాపత్రయ పడతాం? ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే.. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్‌ అన్నీ ఇన్నీ కావు.. పర్‌ఫ్యూమ్స్‌ గురించయితే చెప్పనే అక్కర్లేదు.. వంద గ్రాముల పర్‌ఫ్యూమ్‌ను వంద పదులైనా సరే కొనటానికి వెనుకాడం... కానీ, ఇవన్నీ అక్కరలేని జాతి ఒకటి ఉంది.. మన దేశంలోనే ఉంది..మన మధ్యలోనే ఉంది.. ఆ జాతికి వీటితో పనే లేదు.. ఎవరితోనూ ఆ జాతికి సంబంధమూ లేదు..
2
ఎందుకిలా ఉంటారు? మామూలుగా ప్రపంచం అంతా తమను చూస్తున్నదన్న జిజ్ఞాస వీరికెందుకు ఉండదు? ఎందుకు పట్టదు..? మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానావమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్లిలా ఉండటానికి కారణం ఏమిటి?
సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు.. మిగతా రెంటి మాటెలా ఉన్నా, కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్‌ లాంటిది.. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం.. సన్యాసులూ అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు కాబట్టి, సాధారణంగా వారు కాషాయాన్నే ధరిస్తారు..
ఇది కామన్‌ ఎలిమెంట్‌.. ఇందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు..కానీ ఎవరికీ అంతుపట్టని సాధువుల సమాజం ఒకటుంది.. అది అత్యంత రహస్య సమాజం.. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని అఖారాల్లో ఉండే సాధు జాతి.. దాని పేరు నాగా.. ఆ సన్యాసులే నాగా సాధువులు.
మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు.. తమ లోకంలోనే వారు జీవిస్తుంటారు.. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు.. చివరకు శరీరంపై బట్టల్నీ విడిచిపెట్టిన వాళ్లు.. నాగా సాధువులు
వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు.. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తికాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు..
అంతే కాదు.. జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి.. విడ్డూరంగా కనిపిస్తాయి..
త్రిశూలాలు ధరిస్తారు.. కత్తులు పట్టుకుంటారు.. వాటితో వీరంగం వేస్తారు.. వీరనాట్యాలు చేస్తారు.. కర్రసాము చేస్తారు..
హుక్కా, చిలుమ్‌ వంటి వాటి ద్వారా పొగాకు, నార్కొటిక్స్‌ వంటివి పీలుస్తారు..
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి? అదే మిస్టరీ... అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట..
3
సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో...అవన్నీ వారు చేస్తారు.. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, హుక్కా, చిలుమ్‌ పీల్చటం, ఏది పడితే అది తినేయటం.. ఒంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం.. ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగెటివ్‌ షేడ్సే.. ఏమిటీ రహస్యం? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ నాగాస్‌..
పవిత్ర గంగానదీ తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు, మహా కుంభమేళా జరుగుతుంది.. ఆ కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగా సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం..
నాగా సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు.. జనానికి కనిపిస్తారు.. పుష్కరాలకు ముందు కానీ, తరువాత కానీ, వారు బయటి ప్రపంచానికి కనిపించరు..
వారి చర్యలు విచిత్రం.. వారి చేష్టలు విచిత్రం. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం.. హిమాలయాలు.. దేవతల ఆవాసాలంటారు.. నాగా సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే.. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరి కోరి ఎంచుకుని మరీ తమ మెడిటేషన్‌ను కొనసాగిస్తారు.
వారికి ఎండ లేదు.. వాన లేదు.. చలి లేదు.. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచీ కాపాడుతుంది. చిలుమ్‌, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి.. మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి..
వారు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు.. మిగతా దేవుళ్లందరినీ పూజిస్తే వాళ్లు స్పందించే సరికి చాలా సమయం పడుతుందిట.. అగ్నిని ఆరాధిస్తే.. ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట.. ఆ విభూతే నాగా సాధువులకు సర్వస్వం అవుతోంది..
4
విభూతి అంటే ఐశ్వర్యం.. నాగా సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం.. సర్వ సంపదలూ ఈ విభూతే.. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, వారికి అది అవసరం లేదు.. అత్యంత కఠినమైన యోగసాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివసైనికులు వీరు.
ఉజ్జయిని.. మహా కాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడ ఒకటి.. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది.. ప్రతి రోజూ రాత్రి పూట ఉజ్జయిని స్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు.. భస్మరాశి విభూతిగా మారిపోతుంది... మన శరీరమే విభూతి అని చెప్పటానికి ప్రతీక ఈ అభిషేకం..
నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటమే దీని ఉద్దేశం.
సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు, ఎలా సృష్టించిందీ ఎవరికీ తెలియదు.. సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు అదిశంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశారని అంటారు..
మనం ఉంటున్న ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌ను వీరు కేర్‌ చేయరు. . ఆర్మీలో ఓ రెజిమెంట్‌లాగా నాగా సాధువులు ఉంటారు. వీళ్లు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు..ఎవరినీ దగ్గరకు రానివ్వరు.. అఘోరాల్లా అతి తీవ్రంగా లేకపోయినా, వీరి దారి వేరు.. చాలా ఆవేశపరులు.. వారి ఆగ్రహం ప్రదర్శించటానికి బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగెడ్తారు.. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు..
అఖారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరినీ రానివ్వరు.. ఎవరైనా చొచ్చుకుని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారాణమైన యోగాసనాల్లో నాగా సాధువులు కనిపిస్తారు.. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించినా తరువాత అనుగ్రహిస్తారు.. సామాన్యంగా కనిపించే సన్యాసులకు, వీరికి అదే తేడా... అందుకే వీరిని నాగాలన్నారు..
-5-
సాధువులుగా మారటం తేలికే.. సన్యాసం తీసుకోవటమే కష్టం. అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్నీ వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర, ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారటం ఊహించినంత తేలిక కాదు.. చాలా, చాలా కష్టపడ్డ తరువాత కానీ, నాగాలుగా మారటం కుదరనే కుదరదు..
నాగా సాధువులు అంటే ప్రధానంగా దిగంబరులు.. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అదీ మంచు కొండల్లో.. గడ్డకట్టే చలిలో నూలుపోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది.. కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏమూలకు పనికి వస్తాయి? మరి వీళ్లెలా ఉండగలుగుతున్నారు?
నిజం.. ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు.. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా హార్డ్‌వర్క్‌ చేయాల్సి ఉంటుంది.
సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లూ వాకిలీ వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి.
ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
అన్ని రుచులను వదిలేయాలి.
అన్ని వాసనలకూ దూరంగా ఉండాలి.
అన్ని సుఖాలను త్యాగం చేయాలి.
అన్ని మోహాలను వదిలిపెట్టాలి.
చివరకు వస్త్రాల్నీ వదిలేయాలి.
ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు.. ప్రతి విషయంపైనా ఏకాగ్రత సాధించటానికి చాలానే కష్టపడతారు.. ఆ తరువాత అయిదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటీ ధరించి ఉంటారు.. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు.. అంటే ఈ మెటీరియలిస్టిక్‌ వరల్డ్‌లోని సంసారం నుంచి తనను తాను నాగా సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం.
నేను అనే ఈగోను విడిచేయడమే నాగా సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే, లోపల ఆత్మ అన్నది ఒకటుందని వీరు గాఢంగా నమ్ముతారు.. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు.. మిగతా శరీరంతో వారికి పని లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకోరు.. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదని నాగాలంటారు.
నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు.. ఎక్కడికీ వెళ్లరు.. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నదీతీరానికి వాళ్లు వస్తారు.. పవిత్ర స్నానాలు చేసి వెళ్లిపోతారు.. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు..

No comments:

Post a Comment