Saturday 30 January 2016

పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం.


విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం.
ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారం భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్ర్తియ కోణం ఏంటంటే ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి దీన్ని పుష్యమాసం అన్నారు పెద్దలు. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.
పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా ఆ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని నమ్మిక. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది.
శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఒక్కోసారి ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పుష్యమాసంలో కూడా వస్తుంది. వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ద్వారం తెరచి ఉంచుతారు. భక్తులందరూ ఆ ద్వారం గుండానే స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడనటానికి చిహ్నం ఈ ఉత్తరద్వార దర్శనం. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. తెలకపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం.
ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఆ రోజును షట్తివైకాదశి (షట్+తిల+ఏకాదశి) అంటారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయ్లో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం

No comments:

Post a Comment