Saturday 26 March 2016

దక్షిణాదేవి మహిమ


ఒక గోపిక ... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో ... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది.గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను .ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను .
ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది..దక్షిణ ,గోలోకము వదలి వైకుంటము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను .దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.
"దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా " అని శ్రుతి (యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి . ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి ,యజమానునకి చ్చును ) దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను . ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి . బ్రహ్మ కోరికపై విష్ణువు , లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను .యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను .యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.
బ్రహ్మ ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను . "యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును.దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును " అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.
" యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్ ,దురిష్టగ్ స్యాత్ " అని శ్రుతి (బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు ,అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము )
శ్రాద్ధ కర్మలయందు,యజ్ఞ కర్మల యందు,దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను,పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును.శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.
దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం,విద్య,స్ధిరాస్తులు,లభించును.అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి ... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment