Friday 22 July 2016

సుబ్రహ్మణ్యుని లీలలు

సుబ్రహ్మణ్యుని లీలలు
===============
పార్వతీ దేవి కరుణామయి, అనుగ్రహరాశి, మరి తండ్రి శంకరుడో ఉబ్బులింగడు, ఆయనా అనుగ్రహ రాశి..... ఈ ఇద్దరి అనుగ్రహాల కలపోత మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి వారు.
ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణములు చెప్తున్నాయి. ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడు లో ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసేముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా
1. తిరుచెందూర్
2. తిరుప్పరంకుండ్రం
3. పళముదిర్చొళై
4. పళని
5. స్వామిమలై
6. తిరుత్తణి
అమ్మవారి అనుగ్రహము వలన, 2008 లో మేము తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు పళని స్వామి దర్శనం అయ్యింది. అప్పుడు ఈ ఆరు క్షేత్రముల గురించి మాకు తెలిసింది. తరువాత పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “శివ పురాణము” ప్రవచనములో ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల గురించి వివరముగా తెలియజేయడం వలన ఈ సంవత్సరం 2011 మాఘ మాసములో ఈ ఆరు క్షేత్రములను దర్శించే భాగ్యం మాకు కలిగింది. స్వామి వారి ఆరు ముఖముల దర్శన భాగ్యము ద్వారా పొందిన ఆనందాన్ని, సుబ్రహ్మణ్య కటాక్షమును అందరితోనూ పంచుకోవాలని, “ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు” అనే శీర్షికన ఈ క్షేత్రముల గురించి వ్రాద్దామని చేస్తున్న చిన్ని ప్రయత్నం.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ ఆరుపడై వీడు క్షేత్రముల యందు తనని సేవించిన వారిని విశేషముగా అనుగ్రహిస్తారు. ఈ ఆరు క్షేత్రములలో ఒకో రూపములో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ ఎక్కువగా కొండమీదే ఉంటాయి. ఇప్పటికీ ఆది శంకరాచార్యుల సాంప్రదాయ పీఠాధిపతులు అయిన జగద్గురువులు వారు పీఠాన్ని అధిరోహించే ముందు తప్పని సరిగా ఒక సారి ఈ ఆరుపడై వీడు క్షేత్రములను పాదచారులై దర్శించి వస్తారు అని విన్నాను. సుబ్రహ్మణ్య అనుగ్రహము తోనే అటు శ్రీ విద్యా ఉపాసనలో అయినా, ఇటు జ్ఞానములో అయినా ఒక స్థాయిలోకి వెళ్ళడం సాధ్యం అని పెద్దలు చెప్తారు.
నాగదోషం ఉన్న వారు ఎవరైనా ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కామ్యములు నెరవేరుతాయి. అంతేకాక, కుజ గ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టి ప్రార్ధిస్తే కుజదోషం తొలగి పోతుంది. ఇవ్వాళ దేశంలో అనేక ప్రమాదాలు జరగడానికి కారణం ఈ కుజ దోషం వల్లనే. కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్లనే సాధ్యం అని పెద్దలు చెప్తారు. అటువంటి సుబ్రహ్మణ్యుని దివ్య క్షేత్రముల మహిమ ఎంతటిదో మనం ఊహించవచ్చు.

No comments:

Post a Comment