Sunday 8 May 2016

శని వజ్ర పంజర కవచమ్

శనిదోష నివారణ "శని వజ్ర పంజర కవచమ్"
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.
నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
శని వజ్ర పంజర కవచమ్
నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమస్యాద్వరదః ప్రశాంతః ||
బ్రహ్మా ఉవాచ |
శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ |
కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమమ్ ||
కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకమ్ |
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ ||
అథ శ్రీ శని వజ్ర పంజర కవచమ్ |
ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || 1 ||
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || 2 ||
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || 3 ||
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || 4 ||
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః || 5 ||
ఫలశ్రుతిః
ఇత్యేతత్కవచమ్ దివ్యం పఠేత్సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః ||
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా |
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శనిః ||
అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ ||
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా |
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః ||

No comments:

Post a Comment