Sunday 29 November 2015

కార్తీక ‘దామోదర’మాసం


కార్తీకంలో పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంపై సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. కార్తీక మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికి ఒక ప్రాముఖ్యం ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినపుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలిగిపోతాయి. ‘పరంజ్యోతి’ని ఆరాధన చేస్తున్నా అనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంది.
కార్తీక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి చిన్నపాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంబంపై వెలుగులీనుతూ ఈశ్వరునికి ఉత్సవం నిర్వహిస్తుందనే భావనతో ఇలా చేస్తుంటారు.
కార్తీక మాసంలో శివారాధనకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో, విష్ణు ఆరాధనకు అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ ‘దామోదరమావాహయామి’ లేదా ‘త్య్రయంబకమావాహయామి’ అని అంటారు. దామోదర నామం విష్ణు సంబంధమైనది. త్య్రయంబకం అంటే పరమశివుడు. ఈ నామాలు చెబుతూ తమ తమ ఇష్ట దైవాలను ఆవాహన చేస్తారు. ఈ దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తుంది. ఉపాసనాశక్తిని పెంచుకోవడానికి కార్తీక మాసం అనుకూలమైన సమయం.
ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు.
శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు.
‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

No comments:

Post a Comment